AP Mega DSC: జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు
- AP Teachers TV
- 14 hours ago
- 2 min read
మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్ 30కి కుదించారు.
ఆగస్టు రెండో వారంలో ఫలితాలు

AP Mega DSC: అమరావతి: మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్ 30కి కుదించారు. మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) ప్రారంభమవుతాయి. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని పరీక్షలు మధ్యలో.. చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతాయి. మళ్లీ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో పరీక్షలుంటాయి. ఎస్జీటీలకు 13న మధ్యాహ్నం, 17న ఉదయం, 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీలకు జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు విడతల్లో కలిపి సుమారు 40 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు.
మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులతోపాటు ఎస్ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి ఎస్ఏ హాల్టికెట్లు జారీ చేయలేదు.
కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి, ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి, అది పూర్తికాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారమే హాల్టికెట్లు జారీ చేశారు.
ఆగస్టులో ఫలితాలు: పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం ఆరు రకాల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టులకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తం 16,347 పోస్టుల్లో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరికి పోటీ పరీక్ష ఉండదు. వారు సాధించిన పతకాలే ప్రామాణికంగా శాప్ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వాట్సప్లోనూ హాల్టికెట్లు: మంత్రి లోకేశ్
మెగా డీఎస్సీ హాల్టికెట్లను వెబ్సైట్తోపాటు వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చని మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు
Comentarios