top of page

Sunita Williams: మేము భూమి పైకి ఎప్పుడు వస్తామో తెలియట్లేదు: సునీతా విలియమ్స్‌

Sunita Williams: మేము భూమి పైకి ఎప్పుడు వస్తామో తెలియట్లేదు: సునీతా విలియమ్స్‌


Sunita Williams: వారం రోజుల్లో భూమి పైకి తిరిగిరావాల్సిన సునీతా విలియమ్స్ కొన్ని నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచే పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.

Sunita Williams: మేము భూమి పైకి ఎప్పుడు వస్తామో తెలియట్లేదు: సునీతా విలియమ్స్‌

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్‌ విల్మోర్ (Butch Wilmore) కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. దాంతో వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపైనా ఈ వ్యోమగాములు స్పందించారు.


‘‘మేము భూమిమీదకు తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశం’’ అని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా తాము అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల వ్యక్తమవుతోన్న ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ.. భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్‌ అంగీకరించారు. 2030లో అంతరిక్ష కేంద్రం (ISS) జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. అప్పటికంటేముందే ఐఎస్‌ఎస్‌ను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్‌ ప్రతిపాదించారు. ‘‘ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం. నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను’’ అని విలియమ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు.



ఐఎస్‌ఎస్‌లో చిక్కుపోయిన వారిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలపై విల్మోర్ స్పందించారు. ‘‘అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని నా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్‌ పట్ల గౌరవం ఉంది. మేం మా దేశానికి, మా నాయకులకు మద్దతు ఇస్తాం. వారికి మా కృతజ్ఞతలు’’ అని మాట్లాడారు.

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో వారు ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్‌(Sunita Williams), బచ్‌ విల్మోర్‌లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్మోర్‌ అప్పటినుంచి ఐఎస్‌ఎస్‌లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా (NASA) స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది.

ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్‌ఎస్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్‌ ఎక్స్‌ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. ఇక సునీత విలియమ్స్‌, విల్మోర్‌ కొన్నిరోజుల క్రితం స్పేస్‌ నుంచి మీడియాతో మాట్లాడారు. తమకోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని తెలిపారు.




 
 
 

Comments


bottom of page