top of page

కోచింగ్ క్లాస్‌లపై నమ్మకం లేదు..Infosis నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Narayana Murthy: కోచింగ్‌ క్లాస్‌లపై ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిపై తనకు నమ్మకం లేదన్నారు.


Infosis Narayana murthy
Infosis Narayana murthy

తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్‌ క్లాస్‌ (Coaching Classes)లు అవసరమవుతాయని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు అవి తప్పుడు మార్గంగా నిలుస్తున్నాయని అన్నారు. అలాంటి వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. బెంగళూరులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశంపై అడిగిన ప్రశ్నకు నారాయణమూర్తి స్పందించారు. ‘‘ఈ రోజుల్లో కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్లే చాలామంది తరగతి గదిలో క్లాస్‌లను సరిగా విననివారే. లేదా ఇంటివద్ద తల్లిదండ్రులు వారికి చదువులో సాయం చేయలేని స్థితిలోనైనా ఉండి ఉండాలి. అలాంటివారే కోచింగ్‌ క్లాస్‌లకు ఆసక్తి చూపుతారు. దురదృష్టవశాత్తూ మన దేశంలో బట్టీ చదువులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, వాస్తవిక సమస్యలను పరిష్కరించుకునే సన్నద్ధత తగ్గిపోతోంది’’ అని నారాయణమూర్తి (Infosys Co-Founder Narayana Murthy) సమాధానమిచ్చారు.



ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడమే అసలైన విద్యావిధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ముందు దేన్నైనా పరిశీలించాలి. ఆ తర్వాత దాన్ని విశ్లేషించాలి. తర్వాత దాన్ని అన్వయించుకోవాలి. చివరకు ఫలితాన్ని ధ్రువీకరించుకోవాలి. ఇదే అసలైన విద్యా ప్రాముఖ్యత’’ అని నారాయణమూర్తి తెలిపారు.

మీరు సినిమాలు చూస్తూ పిల్లలను చదవమంటే ఎలా..?

ఈసందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఆయన పలు సూచనలు చేశారు. ‘‘పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ.. పిల్లలను చదువుకోమని చెబితే ఎలా..? మా పిల్లలు అక్షతా, రోహన్‌ చదువుల కోసం నేను, నా భార్య సుధామూర్తి ప్రతిరోజూ మూడున్నర గంటలు కేటాయించేవాళ్లం. మనం పుస్తకం పట్టుకుంటే మనల్ని చూసి పిల్లలకు కూడా చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుంది’’ అని నారాయణమూర్తి వివరించారు.



 
 
 

Comments


bottom of page