తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా? జబ్బులకు దారితీసే ప్రమాదం..!
- AP Teachers TV
- Mar 9
- 2 min read
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం, నిద్ర పోవడం.. ఇలాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. మీరూ అంతేనా? అయితే ఈ అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు.

భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం, నిద్ర పోవడం.. ఇలాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. మీరూ అంతేనా? అయితే ఈ అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు. తెలిసో, తెలియకో చాలామంది చేసే ఈ పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా కొంతమందిలో లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుందని అంటున్నారు. మరైతే భోజనం చేసిన వెంటనే చేయకూడని ఆ పనులేంటో తెలుసుకుందాం రండి..
స్నానం చేస్తున్నారా?
తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు కొందరు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం రక్తప్రసరణపై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే షవర్ చేయమంటున్నారు.
గంట తర్వాతే ఇవి!
భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్.. వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట! కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదట!
ఇక తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేసే వారూ చాలామందే! ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్, జీర్ణ రసాలు.. వంటివి పొట్టలో తక్కువగా ఉత్పత్తవుతాయట! ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
పండ్లు అప్పుడే తీసుకోవాలట!
తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఇది నిజమే అయినా భోంచేశాక తీసుకునే కంటే అల్పాహార సమయంలో తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం! కాబట్టి పండు తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్గా, మిడ్మీల్గా (అల్పాహారం, లంచ్కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్గా తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలో తలెత్తాలని లేదు. అందుకే ఈ అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేసి.. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన.












Comments