top of page

AP TET 2024 Applications: ఏపీ టెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు


ఏపీలో టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది.

ree

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3తో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా.. 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 1-ఎకు 1,82,609మంది దరఖాస్తు చేసుకోగా.. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది  అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి 70,767మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 2- బి విభాగంలో 2,438మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే (అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు) టెట్‌ పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తామని.. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. 



రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ టెట్‌ షెడ్యూల్‌లో గతంలో పలు మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు పోటీపడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది.



 
 
 

Comments


bottom of page