top of page

No-detention policy: 5, 8 తరగతి విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌ విధానం’ రద్దు చేసిన కేంద్రం

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


No-detention policy: 5, 8 తరగతి విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌ విధానం’ రద్దు చేసిన కేంద్రం
No-detention policy: 5, 8 తరగతి విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌ విధానం’ రద్దు చేసిన కేంద్రం

దిల్లీ: దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌ విధానం’ (No-detention policy) రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టానికి 2019 మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది.

రెండు నెలల్లో మళ్లీ పరీక్ష రాసేందుకు ఛాన్స్‌!




గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్‌ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్‌లోనూ ఫెయిల్‌ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.



పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని.. ఇప్పటికే 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్‌ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్‌ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం)పై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ ‘నో డిటెన్షన్‌ విధానం’ కొనసాగుతున్న విషయం తెలిసిందే.




 
 
 

Comments


bottom of page